ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌ పాటిస్తలే..ఆసిఫాబాద్ కలెక్టరేట్‌‌ ఎదుట ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధర్నా

ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌ పాటిస్తలే..ఆసిఫాబాద్ కలెక్టరేట్‌‌ ఎదుట ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధర్నా
  • ఐదు గంటల పాటు ఆందోళన, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ హామీతో విరమణ

ఆసిఫాబాద్, వెలుగు : ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌ పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాలకు తనను పిలవడం లేదంటూ అసిఫాబాద్‌‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం ధర్నాకు దిగారు. ఆఫీసర్ల తీరును నిరసిస్తూ తన అనుచరులతో కలిసి కలెక్టరేట్‌‌ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిర్యాణి, రెబ్బెన మండలాల్లో ఈ నెల 5న జరిగిన ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజకు తనను పిలవకుండా, ఎలాంటి ప్రొటోకాల్‌‌ లేని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, తిర్యాణి మండల కాంగ్రెస్‌‌ నాయకుడు అనిల్‌‌గౌడ్‌‌తో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించారని మండిపడ్డారు.

ఎంపీడీవో సహా ఇతర అధికారులెవరూ తనకు ఆహ్వానం పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గెలిపించిన తనను కాదని ఇతర వ్యక్తులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఆదివాసీ, మహిళా ఎమ్మెల్యేననే తనను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. ప్రొటోకాల్‌‌ లేని కాంగ్రెస్‌‌ నాయకుల చేత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించిన రెబ్బెన ఎంపీడీవో, తిర్యాణి హౌజింగ్‌‌ ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్‌‌ ఇవ్వాలని హౌసింగ్‌‌ ఆఫీసర్లను ఎన్ని సార్లు అడిగినా ఇవ్వడం లేదన్నారు. ప్రొటోకాల్‌‌ పాటించని ఆఫీసర్లను సస్పెండ్‌‌ చేసే వరకు ధర్నాను విరమించేది లేదని పట్టుబట్టారు. సుమారు ఐదు గంటల పాటు కలెక్టరేట్‌‌ ఎదుట బైఠాయించారు. చివరకు అడిషనల్‌‌ కలెక్టర్‌‌ డేవిడ్‌‌ వచ్చి ధర్నా విరమించాలని కోరారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్‌‌ ఇవ్వకపోవడంతో పాటు ప్రొటోకాల్‌‌ పాటించని ఆఫీసర్లపై వారం రోజుల్లోగా సస్పెన్షన్‌‌ వేటు వేయాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌‌ పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్‌‌ను తెప్పించి ఇచ్చారు. ప్రొటోకాల్‌‌ పాటించని ఎంపీడీవో, హౌసింగ్‌‌ ఏఈపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని, ప్రొటోకాల్‌‌ పాటించేలా చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్‌‌ హామీ ఇవ్వడంతో ఆమె ధర్నా విరమించారు.